Monday, February 6, 2012

మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ - 2012


నేను టీవీ ఎక్కువ చూడను. పండు గాడు పుట్టాక అసలే తగ్గించేసాను. ఇప్పుడు ఎప్పుడయినా చూడాలని పెట్టుకున్నా కూడా నా పుత్రరత్నం చూడనివ్వడు. వెళ్లి ఆపేసి 'అమ్మా ..ఆకుందాం(ఆడుకుందాం)' అంటాడు :( పొద్దున్న వాడు స్కూల్ కి వెళ్ళినప్పుడు వంట, నెట్, పుస్తకాలతో సరిపోతుంది నాకు. నిన్న ఆదివారం అవడం తో అమ్మ వాళ్ళింటికి వెళ్ళాము. అక్కడ పొద్దున్నుండి చేతన్ భగత్ రాసిన R2020 (దీని గురించి రివ్యూస్ బ్లాగ్ లో రాస్తాను)  బుక్ పట్టుకుని కూర్చున్నాను. సాయంత్రం కూడా అది చదువుకుంటుండగా అమ్మ టీవీ పెట్టి మా టీవీ లో మ్యూజిక్ అవార్డ్స్ వస్తున్నాయి చూడు నువ్వు కూడా అంది. అదృష్టవశాత్తు పండు గాడు కూడా మమ్మల్ని విసిగించకుండా పక్క ఇంటి పిల్లలతో బిల్డింగ్ బ్లాక్స్ తో ఆడుకుంటూ కూర్చున్నాడు. అలా చాలా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఒక రెండు గంటలు TV చూసే అవకాశం దక్కింది.

ఈ అవార్డ్స్ కార్యక్రమంలో నాకు నచ్చిన మొదటి విషయం ఏంటంటే అవార్డ్స్ అన్నీ కూడా కొత్త కొత్త వాళ్లకి (అదీ యువతకి) ఇచ్చారు. ఇంతకు ముందు ఉత్తమ గాయని/గాయకుడు అనే SPB /చిత్ర/సునీత/ఉదిత్ నారాయణ్ ఇంతకు మించి పేర్లు వినిపించేవి కావు. ఇప్పుడు అంతా ఫ్రెష్ టాలెంట్. చిన్న చిన్న పిల్లలు (అంటే నాకంటే చిన్నాళ్ళు కాబట్టి నాకు పిల్లల్లాగానే అనిపించారు) అందరూ. ఎంతో బాగా పాడుతున్నారు, మ్యూజిక్ ఇస్తున్నారు, డాన్సులు compose చేస్తున్నారు. నిజంగా చాలా చాలా నచ్చింది నాకు ఈ పరిణామం.

ఇక రెండో విషయం నాకిష్టమయిన సినీ గీత రచయిత అయిన 'సిరి వెన్నెల' సీతారామశాస్త్రి గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం.

'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ చంటి పిల్లలకి జోల పాడినా,

'ప్రాగ్దిశ వేణియ పైన  దినకర మయూఖ తంత్రుల పైనా, జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన' అంటూ తెలుగు పదాలను అత్యంత రమణీయంగా పాటలో కూర్చినా,

'బోటనీ పాఠం వుంది , మాటినీ ఆట వుంది దేనికో వోటు చెప్పరా' అని కాలేజీ కుర్రాళ్ళ అల్లరి, మనోభావాలని పాటగా మలిచినా,

'క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురు, బయట వున్నది ప్రపంచమంతా చూడరా గురూ' అంటూ పుస్తకాల్లో పాఠాలకి, జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలకి తేడా చెప్పినా,

'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం, మారదు కాలం, ఎవ్వరు ఏమయిపోనీ దేవుడు దిగిరానీ' అని సమాజంలోని కుళ్ళు కుతంత్రాల గురించి ఆక్రోసించినా,

'అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా; నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చ్ఛ ను చూద్దామా, దాన్నే స్వరాజ్యమందామా' అంటూ సూటిగా గుండెల్లో బాకు దించినట్టుగా నిలదీసినా,


'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా..కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్ధం, బ్రతుకును కానీయకు వ్యర్ధం' అంటూ మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తి ని మనకి అర్ధమయ్యేలా చెప్పినా ,

'బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఐ, ఈ నేర్చుకున్నా' అంటూ మాస్ పాట రాసినా

'నువ్వు, నువ్వు, నువ్వే నువ్వు..నాలోనా నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వూ' అంటూ ప్రేయసి హృదయాన్ని అత్యంత సుందరంగా ఆవిష్కరించినా,

'జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది' అంటూ కవి యొక్క జీవిత సారాంశాన్ని కాచి వడబోసినా,

ఇలా ఏ సందర్భానికి అనుగుణంగా పాట వ్రాసినా హృదయానికి హత్తుకునేలా మాత్రమే కాకుండా హృదయాంతరాల్లోకి  దూసుకు వెళ్ళేలా వ్రాసిన ఘనత సిరివెన్నెల గారిదే. అలాంటి మహాకవి గొప్పతనం గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా పొగిడారు. కానీ నిన్న చూసిన ఫంక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సిరివెన్నెల గారి గురించి ఇచ్చిన స్పీచ్ నాకు తెగ నచ్చేసింది.

'సీతారామ శాస్త్రి గారి లాంటి గొప్ప కవి సినిమా పాటలు రాయడం, ఆయన ప్రతిభ సినిమాలకే పరిమితమవ్వడం ఆయన దురదృష్టం, మన అదృష్టం' అన్నారు. చాలా చాలా బాగా మాట్లాడారు త్రివిక్రమ్ గారు. హాట్స్ ఆఫ్!
సినిమా పాటలలో సాహిత్యపు విలువలు అడుగంటుతున్న ఇప్పటి రోజుల్లో సిరివెన్నెల గారి లాంటి వాళ్ళు సినీ జగత్తు లో వుండటం మన అదృష్టం కాక మరేంటి?




ఈ వీడియో సరిగ్గా రన్ అవుతుందో లేదో నేను మొత్తం చూడలేదు. కానీ ఇంతకంటే మంచి లింక్ వేరేది దొరకలేదు.

No comments:

Post a Comment