Friday, February 3, 2012

ఒక చిన్న సంఘర్షణ

చిన్నప్పుడు ఆరవ తరగతిలో అనుకుంటా భత్రుహరి సుభాషితాలు ఉండేవి తెలుగు పాఠాల్లో...వాటిల్లో నాకు బాగా నచ్చిన సుభాషితం ఇది,

ఒరులేయవి యొనరించిన నరవర
యప్రియంబు తన మనంబున కగు
తానొరులకు నవి సేయకుని
పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్

ఈ పద్యం యొక్క భావం అందరికీ తెలిసిందే,

ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకి కష్టం కలుగుతుందో అటువంటి పనిని నువ్వు ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమయిన ధర్మం అని.

కానీ నిజ జీవితంలో ఇది ఆచరించడం సాధ్యమేనా?

ఉదాహరణకి మనల్ని ఎవరన్నా అవమానిస్తే మన మనసుకి చాలా కష్టం కలుగుతుంది, వాళ్ళు మనకి బాగా దగ్గర వాళ్ళయితే ఒకసారి, రెండు సార్లు, పది సార్లు వోర్చుకుంటాము...కానీ పదే పదే (మన ఫీలింగ్స్ వాళ్ళకి చెప్పినా కూడా) మనల్ని వాళ్ళ ప్రవర్తన ద్వారా బాధిస్తుంటే ఇంకా వాళ్ళతో మంచిగా వుండటం వీలయ్యే పనేనా? ఎప్పుడో ఒక సారి కోపం వచ్చి తిరిగి ఒక మాట అనకుండా ఉండగలమా. అలా అనలేకపోయినా కనీసం వాళ్ళకి దూరంగా ఉంటాము కదా పట్టించుకోకుండా. అంతే కానీ అవతలి వ్యక్తి నన్ను ఎంత అవమానించినా అతని పట్ల నేను చాలా మామూలుగానే ఉంటూ అతన్ని గౌరవిస్తాను అని ఎంతమంది అనగలరు? తనకి ఇష్టమయినప్పుడు దగ్గరగా వచ్చి నవ్వుతూ మాట్లాడగానే పాత సంగతులు మర్చిపోయి తేలిగ్గా నవ్వెయ్యగలమా? మనం అలా చెయ్యకుండా వాళ్ళని పట్టించుకోకుండా వుంటే వాళ్ళకీ బాధ కలుగుతుంది కదా.

పుస్తకాల్లో చదివిన వాటిని జీవితంలో ఆచరించడం గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే చెయ్యగలరు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది సమాజంలో జనం మధ్య బ్రతకడానికి ఉపయోగపడని ఈ సూక్తులూ, సుభాషితాలు దేనికీ అని?

No comments:

Post a Comment