జీవితంలో చాలా సార్లు నాకు అనిపిస్తుంది, కొన్ని విషయాల గురించి ఎంత
తక్కువ information తెలిసి వుంటే అంత మంచిది అని…నిన్న పొద్దున్న మా పండు
గాడితో ఆడుకోడానికి పక్క వీధిలో పాప వచ్చింది. స్కూల్ టైం లో ఎలా వచ్చిందా
అనుకుంటూ అదే అడిగాను,
“ప్రీతీ, ఏంటి స్కూల్ కి వెళ్ళలేదా ఈ రోజు”
“లేదు ఆంటీ, సెలవు కదా”
“పండగ ఏం కాదే, ఎందుకూ సెలవు?”
“అయ్యో, మీకు తెలీదా…ఈ రోజు బంద్, ఏవో గొడవలవుతాయని అంటున్నారుగా”
“గొడవలా, ఎందుకూ?”
“ఎందుకో మరి అందరూ కొట్టుకుంటారని చెప్తున్నారు, హిందూ ముస్లిమ్స్ గొడవ పడతారట..టీవీ చూడరా మీరు” అని చెప్పి ఆటల్లో మునిగిపోయింది.
ఈ మధ్య టీవీ కాదు కదా, కనీసం పేపర్ కూడా చూడట్లేదు నేను. మాకొచ్చేది
సాక్షి (మా ఆయన వీరాభిమాని జగన్ కి, ఇద్దరం తరచూ గొడవపడుతుంటాం
కూడా)…అందులో మెయిన్ పేపర్, జిల్లా ఎడిషన్ చస్తే చదవను నేను. ఫ్యామిలీ
పేపర్ మాత్రం చదువుతా…ఎప్పుడయినా నెట్ లో ఈనాడు చదువుతాను అంతే. టీవీ లో
న్యూస్ చానల్స్ చూడటం మానేసి చాలా రోజులే అయింది
అప్పుడిక టీవీ పెడితే ఏ ఛానల్ లో చూసినా ఒకటే న్యూస్. అయోధ్య తీర్పు
గురించి. ఈ అయోధ్య గొడవ అప్పుడెప్పుడో అయింది కదా ఇప్పుడు కొత్తగా ఏంటి
అనుకుని కొంచెం కుదురుగా కూర్చుని చూస్తే అప్పుడు అర్ధమయ్యింది. చాలా కాలం
నుండి కోర్టులో నలుగుతున్న ఈ కేసులో ఈ రోజు తీర్పు చెప్పబోతున్నారు అని.
సో అదీ నాకున్న జ్ఞానం ఈ విషయంలో.
ఈ ప్రీతి అనే పాప కి ఏడేళ్ళు. తను పుట్టక ముందు ఎక్కడో UP లో జరిగిన
గొడవ గురించి ఆ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంకొంచెం పెద్దయ్యాక
హిస్టరీ క్లాసు లో తెల్సుకుంటుందేమో. కానీ ఇప్పుడయితే ఆ లేత మనసుకి
అర్ధమయ్యింది ఒకటే, హిందువులు – ముస్లింలు కొట్టుకుంటారు అని. అసలిద్దరికీ
వచ్చిన తేడా ఏంటో, ఎందుకు కొట్టుకుంటారో, ఎవరి స్వార్థం వల్ల గొడవ ఇంత
దాకా వచ్చిందో ఆ పసి మనసు ఊహకి అందని విషయం. క్లాసు పుస్తకాల్లో
బోల్డన్ని మంచి మంచి మాటలుంటాయి మత సామరస్యం మీద. కానీ తనకి నిజ
జీవితంలో కనిపిస్తుంది ఏంటి? పరస్పర విరుద్ధమయిన ఈ రెండు విషయాల మధ్య ఆ పాప
ఎంత అయోమయానికి గురవుతుంది?
రాజకీయాలు, మతం, ఈ గొడవలు అన్నీ పక్కన పెట్టి నా (ఒక
సాధారణ వ్యక్తి) చుట్టూ వున్న పరిస్థితి గురించి చెప్పాలంటే ఇక్కడ
హిందూ-ముస్లిం అనే తేడా కేవలం ఆచార వ్యవహారాల్లోనూ, దేవుడిని కొలిచే
పద్దతిలోనూ కనిపిస్తుంది తప్పితే ఇద్దరికీ మధ్య గొడవలు అయ్యే సంఘటనలు,
సందర్భాలు వుండవు (నాకు కనిపించలేదు). రంజాన్ అయితే వాళ్ళు మాకు బిర్యాని
పంపితే, సంక్రాంతి అప్పుడు మేము వాళ్లకి అరిసెలు పంపుతాం. రొట్టెల పండుగ
కి మేము దర్గాకి వెళ్లి మొక్కుకుంటే వినాయక చవితి పూజల్లో వాళ్ళు దేవుడి
విగ్రహం దగ్గరకి వచ్చి దండం పెట్టుకుంటారు. ఎవరి ఆచారాలు వాళ్ళవి. ఎదుటి
వారి పద్ధతిని, సంప్రదాయాన్ని ఎవరూ వేలెత్తి చూపరు. ఇలా హాయిగా
గడిచిపోతోంది కదా..
ఈ దేశంలో ఒక సాధారణ పౌరుడికి ఈ మతం వల్ల లేని ఇబ్బంది, ఈ
పౌరులకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులకి ఎందుకు? మమ్మల్ని ఏదో
ఉద్ధరిస్తున్నామని, మాకోసం మీరు పోరాడుతున్నారు అన్న తప్పుడు సంకేతం
జనాలకి ఇచ్చి ఆ జనం కొట్టుకు చస్తుంటే చూసి మీ popularity పెంచుకుంటూ,
భావి తరాలని ఒక అయోమయం లోకి నెట్టేస్తూ ఎటు తీసుకెళ్తున్నారు ఈ సమాజాన్ని?
ఆ వివాదాస్పద స్థలంలో మసీదు కట్టుకుంటారో, మందిరం కట్టుకుంటారో మీ
చావు మీరు చావండి…మా (ప్రజల) జోలికి రాకండి అని గట్టిగా అరిచి
చెప్పాలనిపిస్తుంది. ఇదంతా చూసాక ఎందుకు ఇదంతా ఆలోచించడం,
తెల్సుకోవడం అనిపిస్తుంది. Ignorance is a bliss అన్నది ఎంత నిజమో కదా.
ఇక ఈ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎలాంటి గొడవలు జరగకపోవడం
చాలా ఆనందంగా వుంది. ఇది ఆ తీర్పు అందరికీ అనుకూలం
అయినందువలన (పేపర్లో అలా రాసారు) అని అంటున్నారు. కాదు కాదు ఈ ప్రశాంతత ఆ
కొట్టుకు చచ్చే వాళ్ళలో, గొడవలు పెంచే వాళ్ళలో వచ్చిన మార్పు వలన అని
అనుకోవాలని వుంది
ఈ రోజు పొద్దున్న వీధిలో పిల్లలంతా స్కూల్ కి రంగు రంగుల బట్టలు
(శుక్రవారం సివిల్ డ్రెస్ అంట) వేసుకుని సీతాకోకచిలుకల్లా గంతులేస్తూ
వెళ్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇదే ప్రశాంతత ప్రతి రోజూ కావాలి.
No comments:
Post a Comment